ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శ్రీవారికి ప్రేమలేఖ - వసుంధర

వసుధర కథలు పుస్తకం నుంచి

"మన దేశంలో ప్రతి భర్తా భోజరాజు, ప్రతి భార్యా కాళిదాసు. వారి అనుబంధాల నుంచి పుట్టిన జీవిత ప్రబంధాల ముందు కాళిదాసు ప్రబంధాలు కూడా వెలవెలబోక తప్పదు."

"మీ తొలిరాత్రి అనుభవాలు నాకు చెప్పాలి. ఏ సంకోచమూ లేకుండా జరిగింది జరిగినట్లు చెప్పాలి. మీ వివరాలు రహస్యంగా వుంచబడతాయి. మీరు నిజీయితీ పటిస్తే అందువల్ల ఎందరో యువతి యువకులకు ఎంతో ప్రయోజనం" అంది కుసుమ.

ఆ గదిలో వున్న ఆరుగురు ఆడవాళ్ళూ ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్ళక్కడ  పోసుకోలు కబుర్లకు చేరారు. కబుర్ల మధ్యలో శృంగారం చోటుచేసుకోబోతే తనకి ఆసక్తిలేనట్లుగా ముఖం చిట్లించింది గూడా, వారిలో జయ అనబడే ఆమె.

మిగతా అయిదుగురూ ఆ పేటవారే! జయమాత్రం ఏదో పనిమీద పుట్టింటికి వచ్చి పదిరోజులైంది. ఇంకో రెండువారాలుంటుంది.

జయకు వయసు ౩౦-౩౫ మధ్యలో వుంటుంది. పద్ధెనిమిదో ఏట పెళ్ళై కాపురానికి వెళ్ళింది. ఇద్దరు పిల్లల దల్లి అయినా బయటివాళ్ళతో ఆ కబుర్లు ఏ సందర్భంలోనూ మాట్లాడదు. మనిషి కూడా గంభీరంగానూ, హుందాగానూ వుంటుంది.

పుట్టింటికెప్పుడొచ్చినా అమ్మలక్కలామెను అభిమానంగా పిలుస్తుంటారు. అందరితోనూ మంచిగా వుంటూ అందరి గురించీ మంచే చెబుతుందని ఆమె అంటే వాళ్ళకు ఇష్టం. నిత్యం అక్కడే వుంటే ఏమో కానీ అప్పుడప్పుడు కలుస్తుడడంవల్లనేమో వారి స్నేహంలో ఏ మార్పూ లేదు.

"నువ్వేమీ మారలేదు జయా!" అన్నారు అమ్మలక్కలు ఆమె ముకం చిట్లింపు చూసి ముచ్చటపడుతూ. సరిగ్గా అప్పుడే తలుపులు తెరచివున్న గుమ్మంలో కుసుమ ప్రత్యక్షమైంది.

క్రీమ్కలర్ చుడీదార్లో, దేవకన్యల ముఖ సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమెను చూసి ఆడవాళ్ళందరూ ఒక్కసారిగా అప్రతిభులయ్యారు.

ఆమె వయసు ౨౦-౨౫ మధ్యలో వుండవచ్చు. ముఖంలో మాత్రం జ్ఞానతేజం స్పష్టంగా వెలుగుతోంది. ఆమె భుజానికో సంచీ వేలాడుతోంది.

కుసుమ రచయిత్రి. ఆమె రాసిన అయిదారు నవలలు విపరీతంగా అమ్ముడై పాఠకులపై ఆమె రచనా శక్తికున్న ఆకర్షణను నిరూపించాయి. ఇప్పుడామెకు వాటికి భిన్నంగా సాంఘిక ప్రయోజనమున్న పరిశోధనాత్మక రచనలు చేయాలని కోరిక పుట్టింది.

వాటిలో భారతీయ మహిళల శృంగార జీవతం - ఇంతవరకు ఎవరూ దర్శించని కోణాలనుంచి ప్రదర్శించాలన్నది ఆమె తొలిప్రయత్నం.

ఈ మాత్రం తన గురించి చెప్పుకొని ఆమె భుజానికి వేలాడుతున్న సంచీలోంచి ఒక నోట్ బుక్నూ, బాల్ పెన్నునూ తీసి - వారిని తొలిరాత్రి అనుభవాలను చెప్పమనేసరికి అంత సూటిగా అడుగుతుందని తెలియక వాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు.

"ఇందులో మొహమాటపడవలసిందేమీ లేదు. సిగ్గు పడాల్సింది మొదలో లేదు. శృంగార విశేషాలు దాచిపెట్టి మనం చాలా పెద్దపొరపాటు చేస్తున్నాం. మన ఋషులు విజ్ఞాన విశేషాలు దాచిపెట్టి భావితరాలను పాశ్చాత్య సంస్కృతివైపు తరుముతున్నాం. ప్లీజ్ - నాకు మీ సహకారం కావాలి!" అంది కుసుమ వారినందరినీ హెచ్చరిస్తూ.

తమలో తాము ఎంతో కొంత శృంగార విశేషాలు చర్చించడం ఆ మగువలకు అభ్యతరం లేదు. వాటికి వాళ్ళు చిలవలూ పలవలూ అల్లుతారు. అబద్ధాల్ని జోడిస్తారు. స్వాభిప్రాయాల్ని అతికిస్తారు. అవి తర్కానికి అందవు కాబట్టి సాంఘిక ప్రయోజనం కోరవారి ప్రశ్నలకు తట్టుకోలేవు.

వారందరూ ఇలా ఆలోచనలతో సతమతమవుతూంటే వారిలోంచి ముందుకు వచ్చి ముందడుగు వేసింది మరెవరో కాదు - జయ!

మిగతావాళ్ళందరూ ఈ పరిణామానికి తెల్లబోయి చూస్తుంటే జయ ఆమెతో "అమ్మాయ్ కుసుమా! నేను నీకు సహకరిస్తాను. కానీ ఇక్కడు కాదు. మా ఇంటికి రా! ఇప్పుడింట్లో ఎవ్వరూ లేరు. మనం ఏకాంతంగా మాట్లాడుకుందాం. నాకు తెలిసినవీ, గుర్తున్నవీ చెబుతాను. నువ్వేమడిగినా అందుకు బదులివ్వడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు టైము  మూడయింది కదా - ఆరింటిల్లా మన సంభాషణ పూర్తవ్వాలి. అప్పటికి మావాళ్ళు తిరిగొచ్చేస్తారు" అంది.

అమ్మలక్కలు ముక్కున వేలేసుకొని - "జయ మారలేదనుకున్నాం. కానీ ఆమె చాలా మారిపోయింది" అనుకున్నారు.

జయ, కుసుమ వాళ్ళింటికి వెళ్ళారు.

జయ ఇంటి తాళం తీస్తూనే, "నేను నీకు సహకరిస్తాననడానికి ఒక్కటే కారణం. నాకు నీ సహాయం కావాలి" అంది.

కుసుమ ఆశ్యర్యంగా చూస్తూ - "మీకు నేనేం సాయపడగలను?" అంది.
ఇద్దరూ ఇంట్లోకి ప్రవేశించారు. జయ తలుపులు మూసి గడియవేస్తూ, "నువ్వు రచయిత్రివి కదా! నా కోసం నా తరపున ఒక ప్రేమలేఖ రాసిపెట్టగలవా?" అంది.

కుసుమ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. "ప్రేమలేఖా? ఎవరికి?" అంది.
"మా వారికి" అంది జయ.
ఇద్దరూ హాల్లో, సోఫాలో కూర్చున్నారు. జయ ఆమెకు తన గోడు చెప్పుకుంది.
జయభర్త కృష్ణమూర్తి. అతడు గొప్ప భావుకుడు. కాలేజీరోజుల్లో ఓ అందమైన అమ్మాయినుంచి ప్రేమలేఖ అందుకున్న వ్యక్తిత్త్వం అతడిది.

ఆ ప్రేమలేఖ ఎంత గొప్పగా వుందంటే అతడు దాన్నిప్పటికీ దాచుకున్నాడు. ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వాళ్ళు నిర్ణయించిన జయను పెళ్ళిచేసుకున్నాడు.

జయకు భావుకత్వం అర్థంకాదు. ఆమె ప్రాక్టికల్ మనిషి. భర్తకు ఏ వేళల్లో ఏం కావాలో చెప్పకుండా తెలుసుకొని అమర్చుతుంది. ఎన్నడూ అతడి మాటకు ఎదురు తిరగదు. తిడితే సహిస్తుంది. పొగిడితే సంబరపడుతుంది. పిల్లలు పుట్టేక వాళ్ళ సంరక్షణ కూడా పూర్తిగా తనే చూసుకుంటోంది.

ఇంట్లో ఎవరెవరి వస్తువులు ఏయే సమయాల్లో ఎక్కడెక్కడ వుంటాయో ఆమెకు తెలుసు. ఆమె వంటి భార్యవుండడం తన అదృష్టమని కృష్ణమూర్తి ఎందరికో చెపుతూ ఆమెతోనూ అంటాడు.

కృష్ణమూర్తికి భావుకత్వం, భావావేశం ఎక్కువ. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. పొంగిపోతాడు. జయ మాత్రం నవ్వి ఊరుకుంటుంది. కుర్రాడికి స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే అతడు సెలబ్రేషన్ అంటాడు. ఆమె, ఇలాగే అన్నిమార్లూ రావాలని కొడుకుని ఓసారి హెచ్చరించి ఊరుకుంటుంది.

అతడామెకు కొత్తచీరకొని, ఇందులో నిన్ను చూడాలనిపించి వెంటనే కొని తెచ్చాను. కట్టుకుని రా. బయటకు వెడదామంటే ఆమె తాపీగా, ఈ వేళ ఏ అకేషమూ లేదు. పదిరోజుల్లో పండగొస్తోంది. ఆ వేళ కట్టుకుంటాను అంటుంది

ఆమెలో భావుకత్వం లేదని అతడు తరచు బాధపడతాడు. మంచి సినిమా చూసినా,పుస్తకం చదివినా, అనుభవం పొందినా అతడు భావోద్రేకం పొందుతాడు. ఆమె ముక్తసరిగా బాగుంది అంటుంది.

అలాంటప్పుడతడొకసారి రెచ్చిపోయి, 'నా కర్మ కొద్దీ మడ్డి మృగాన్ని కట్టుకున్నాను. అంతా నా దురదృష్టం' అంటాడు. ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంది. 'ఇప్పుడు నేనేమన్నాననీ!' అని అతడు నొచ్చుకుంటాడు. 'నేను నిజంగానే మడ్డి మృగాన్ని, మీరు మీకు తగిన పిల్లని పెళ్ళిచేసుకోవలసింది. ఆ ప్రేమలేఖ పిల్లని పెళ్ళిచేసుకుంటే ఎంతో సుఖపడేవారేమో!' అంటుందామె.

కృష్ణమూర్తి కాసేపూరుకుని తిరిగి ఆమెతో అంటాడు - 'ప్రేమలేఖ రాసిన అమ్మాయిని ఎప్పుడో మరిచిపోయాను. ఎందుకంటే అది తొలిచూపులోంచీ పుట్టిన ప్రేమ. చూపులు కాస్త కరవుకాగానే ఆ ప్రేమ అంతరించిపోయింది. మనది సాహచర్యం లోంచి పుట్టిన ప్రేమ. ఇప్పుడు నిన్ను విడిచి క్షణం వుండగలనా?'

జయ అవునేమో అన్నట్లూరుకుంటుంది. తిరిగి కృష్ణమూర్తే ఒకసారి 'చెప్పాలంటే ఆ ప్రేమలేఖ అమ్మాయి ముఖం కూడా నాకిప్పుడు సరిగ్గా గుర్తులేదు. ఆ అమ్మాయిని నా స్కృతిపథంలో నిలబెడుతున్నది ఆ ప్రేమలేఖే! నువ్వు ఒక్కసారంటే ఒక్కసారి ఆ లేఖను మరిపించే అపురూపమైన ప్రేమలేఖను నాకోసం రాయలేవా?' అనడిగాడు.

కృష్ణమూర్తి, జయ ఒకరినొకరు విడిచివున్న సందర్భాలే తక్కువ. ఆ సందర్భాల్లో పరస్పరం ఉత్తరాలు రాసుకుంటారు. కృష్ణమూర్తి రాసే ఉత్తరాల్లో ప్రేమ, విరహం, కవిత్వ పెల్లుబుకుతుంది.

జయమాత్రం 'మీ ఉత్తరం చదువుతూంటే ఎవరైనా చూస్తారేమోనని సిగ్గేసింది. ఇలాంటివి మనిద్దరమే వున్నుప్పుడు వినడానికీ కబుర్లు బాగుంటాయి కానీ ఉత్తరాల్లో ఇలాంటివి వద్దు. నాకూ వచ్చేయాలని వుంది...' అని మామూలు విశేషాలు రాస్తుంది.

అందులో వాళ్ళమ్మ వడియాలు పెట్టడంనుంచి, తను బొబ్బట్లు పెయడంలో కొత్తగా నేర్చుకున్న చిట్కాలనుంచీ, ఇంటి పనిమనిషి కూతురికి విరేచనాలు వెళ్ళడంలాంటివీ వుంటాయి.

జయను భర్త ప్రేమలేఖ గురించి ఒకటికి రెండుసార్లు  అడిగేడు. కానీ ఉత్తరం ముందు కూర్చుంటే ఆమెకు రొటీన్ విషయాలు తప్ప స్ఫురించేవి కాదు. భర్త కోర్కె తీర్చాలంటే ఏ రచయిత్రి సాయమో తీసుకోవాలని గుర్తించింది. అయితే ఎవరిని, ఎలా అడగాలి - అన్నదే సమస్య. అది ఇన్నాళ్ళకిలా తీరింది.

కుసుమ ఈ కథలను ఆశ్చర్యంగా విని, "ఈ విశేషాలే ఒక గొప్ప కథ అవుతాయి. మీ వారికి ప్రేమలేఖ రాయడం కోసం మీవంటివారు నా రచనకు సహకరించే వివరాలివ్వడానికి సిద్ధపడడం అపూర్వ. మీకు నేను తప్పక సాయపడతాను. ఎటొచ్చీ మీరు ఉత్తరం రాయండి. దానికి నేను కొన్ని ప్రేమ వాక్యాలతో కొసమెరుపు ఇస్తాను." అంది.

జయ తల అడ్డంగా వూపి, "భోజరాజుని మెప్పించాలని కొందరు నాబోటివాళ్ళు భోజనం దేహి రాజేంద్ర, ఘృత సూప సమన్వితం అని సామాన్యంగా రాస్తే దాన్ని కాళిదాసు మాహిషశ్చ శరచ్ఛంద్ర, చంద్రికా ధవళం దధిః అని పూరిస్తే భోజరాజు చివరి రెండు పాదాలనూ వేరుగా గుర్తించి అక్షర లక్షలిచ్చేట్ట. మా వారిని మెప్పించే ప్రేమలేఖలో నా వాక్యాలు భోజనం దేహి అన్నంత సామాన్యంగానూ వుంటాయి. మొత్తం ఉత్తరం నువ్వే రాసిపెట్టు" అంది.

కుసుమ అంగీకరించి జయను ఇంటర్వూ చేయడం మొదలెట్టింది. ఆమె జవాబుల్లో చిత్తశుద్ధికీ, ఆమె నుంచి లభించిన సమాచారానికీ కుసుమ ఆశ్చర్యపడింది. చక చకా జయ బదులివ్వడం వల్ల నాలుగున్నరకల్లా ఇంటర్వూ అయిపోయింది. అప్పుడు జయ కుసుమను ప్రేమలేఖ రాసిపెట్టమనీ తను ఈలోగా కాపీ టిఫిన్లు సిద్ధం చేస్తాననీ వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి ప్రేమలేఖ సిద్ధంగా వుంది.

జయ ఆ ఉత్తరం చదివి "ఎంత బాగా రాశావో" అని మెచ్చుకుంది. కుసుమ టిఫిన్ తింటూ, "మీలో భావుకత వుందో లేదో కానీ - మీ చేతి వంట భావుకతను పుట్టిస్తోంది" అంది.

కుసుమ వెళ్ళేక జయ ఆ ప్రేమలేఖను మరోసారి చదువుకొని వేరే కాగితం మీద ఫెయిర్ చేసి తన సంతకం కూడా పెట్టింది. అయితే కొన్ని విశేషాలు రాయలేదని ఆమెకు అసంతృప్తిగా తోచింది. ఆమ్మాయి గౌనుకి తను నేర్చుకున్న డిజైన్ కుట్టింది. పక్కింట్లో దొంగతనం జరిగింది. పాత పనిమనిషిని తీసేసి కొత్త పనిమనిషని పెట్టారు. ఈమె తోమిన గిన్నెలు తళతళా మెరుస్తున్నాయి. ఇంకా ఎన్నో.

ముందు జయ ఇవన్నీ ఉత్తరంలో ఉన్న ఖాళీలో రాయాలనుకుంది. ఈ ఉత్తరాన్నా ఉత్తరంతో కలపడం ఇష్టంలేక అవన్నీ కలిపి వేరే కాగితం మీద రాసింది. పదిహేను పంక్తులు వచ్చాయి. రెండుత్తరాలనీ కవర్లో పెట్టి భర్తకు పోస్టు చేసింది.

కృష్ణమూర్తి కవరు చింపి ఉత్తరం తీశాడు. 'నా హృదయచోరునికి' అంటూ మొదలైన ఆ లేఖ చూసి తెల్లబోయాడు. ఎవరా అని కింద చూస్తే 'మీ హృదయ చోరిణి జయ' అని వుంది.

జయ ఈ వుత్తరం రాసిందా అనుకుంటూ చదివాడు. ఉత్తరంనిండా ప్రేమానుభూతులు, కవిత్వం రసవత్తరంగా వుంది. చదువుకుందుకు బాగుంది. కానీ - అతడిలో ఏదో అసంతృప్తి...

ఉత్తరాన్నాతడు మడిచి కవర్లో పెడుతుండగా ఇంకో కాగితం కలబడి బయటకు తీశాడు. 'ప్రియమైన మీకు... ఉత్తరం పూర్తిచేశాక కొన్ని విశేషాలు మరిచేననిపించి మళ్ళీ ఈ ఉత్తరం రాస్తున్నాను.

అమ్మాయికి గౌనుకి కొత్తగా నేర్చుకున్న డిజైన్ కుట్టాను... కొత్త పనిమనిషి తోమిన గిన్నెలు తళతళా మెరుస్తున్నాయి... మీ జయ'

ఈ ఉత్తరం చదువుతూంటే కృష్ణమూర్తి పరవశించిపోయాడు. ఈ ఉత్తరానికే తానెందుకు పరవశించాడో అతడికి వెంటనే అర్థమైంది. జయదీ, అతడిదీ తొలిచూపుల ప్రేమ కాదు. సాహచర్యంలో ఏర్పడిన ప్రేమ. అందుకే మొదటి ఉత్తరంలో అతడికి జయ కనపడలేదు. రెండో ఉత్తరంలో కనపడింది. ఆమె కలబడితేనే అతడికి పరవశం మరి!

మన దేశంలో ప్రతి భర్తా భోజరాజు, ప్రతి భార్యా కాళిదాసు. వారి అనుబంధాల నుంచే పుట్టిన జీవిత ప్రబంధాలు పుడతాయి. వారి మధ్యకు అసలు కాళిదాసు  వచ్చినా అతడి ప్రబంధాలు వెలవెలబోక తప్పదు.

అయితే ఈ వాస్తవాన్ని కృష్ణమూర్తి కాస్తంత ఆలస్యంగా తెలుసుకున్నాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

పాత పుస్తకాలు - డౌన్లోడ్ చేసుకోవటం - Digital Library of India

మొదట  Downloader-NEW ( Downloader-OLD )ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకు ముందే Downloader-OLD డౌన్లోడ్ చేసుకున్నట్లయితే  update(NEW) కోసం Update(12-09-10) click చెయ్యండి.  Unzip చెయ్యండి. runDM.bat file ని run చెయ్యండి. 'chandamama' option select చేయండి. 'Download Location' field లో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇవ్వండి like C:\ లేదా 'Browse' Button click చేసి  location select చేసుకోండి. 'Year','Month' select చేసుకొని 'download' button click చెయ్యండి. ఒక్కో పేజి download అయిన తర్వాత ఇది ఒకే pdf file గా కలుపుతుంది(with year-month name). -------------------------------------------  1st Picture లో 'Digital Library ' select చేసుకుంటే Digital Library of India నుంచి పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 'http://www.new.dli.ernet.in/'   లో పుస్తకం వెతికి URL తెచ్చుకొని, దాన్ని 'URL' field లో paste చేసి 'add to download ' button click చెయ్యండి. తర్వాత 'd

హనుమత్ కవచం

శ్రీ పంచముఖీ హనుమత్ కవచమ్ ఓం అస్య శ్రీ పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మహా మంత్రస్య బ్రహ్మఋషి:గాయత్రీ చ్ఛంద: శ్రీ రామచంద్రో దేవతా రామ్ బీజం మం శక్తి: ఇతి కీలకం శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధ్యర్ధే పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మంత్ర జపే వినియోగ: రాం అంగుష్ఠాభ్యాం నమ:, రీం తర్జనీభ్యాం నమ: రూ మథ్యమభ్యాం నమ: రై: అనామికాభ్యాం నమ: రౌం కనిష్ఠకాభ్యాం నమ: రం కరతల కర పృష్ఠాభ్యాం నమ: రాం హృదయాయ నమ: రీం శిరసే స్వాహా, రూం శిఖాయై వషట్ రైం కవచాయ హుం రౌం నేత్రత్రయాయ వౌషట్ అస్త్రాయ, ఫట్ భూర్భువ స్సువరోమితి దిగ్బంధ: ధ్యానం వందే వానర నారసింహ ఖగరాట్ క్రోఢాశ్వ వక్త్రాం చితం నానాలంకరణం, త్రిపంచ నయనం, దేదీప్యమానం రుచా || హస్తాబ్జై అర సిఖైట పుస్తక సుధా కుంభాం కుశాద్రీన్ గదాం ఖట్వాంగం ఫణి భూరుహౌ దశ భుజం సర్వారి గర్వాపహమ్ అథ ధ్యానం ప్రవక్ష్యామి శ్రుణు పార్వతి యత్నత: మద్వ్రతం దేవదేవస్య ధ్యానం హనుమంత: పరం పంచవక్త్రం మహాభీమం త్రిపంచ నయనైర్యుతం దశబిర్బాహుభిర్యుక్తం సర్వకామ్యార్ధ సిద్ధిదమ్ పూర్వేతు వానరం వక్త్రం హృదయం సూర్య సన్నిభం దంష్ట్రా కరాళ వదనం భ్రుకుటీ కుటిలోద్భవమ్ అన్యైకం దక్షిణం